రెండున్నర సంవత్సరాల్లో మామునూరు విమానాశ్రయం పూర్తి-కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు

చరిత్రాత్మకమైన ఓరుగల్లు పట్టణానికి విమాన సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది- కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ శుభవార్తను తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పంచుకోవడం సంతోషంగా ఉందని, భూసేకరణ పూర్తయిన రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు అన్నారు.  వరంగల్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్ రావాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అని,  తన హయాంలో ఇది జరగడం సంతోషంగా ఉందని అన్నారు. కవాడిగూడలోని కేంద్ర ప్రభుత్వ సముదాయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తో పాటు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు  మాట్లాడుతూ వరంగల్ ఎయిర్‌పోర్టు గతంలో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉండేది అని, 1981 వరకూ అక్కడ ఏదో ఒక కార్యకలాపం జరుగుతూ ఉండేది అని ఆయన అన్నారు. చిన్న చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక విమానయాన రంగంలో ఓ విప్లవం మొదలైందని తెలిపారు. గత పదేళ్లలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150కి పెరిగిందని చెప్పారు. చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

మామునూరు విమానాశ్రయం క్లియరెన్స్ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని తెలిపారు. వరంగల్ వంటి పెద్ద  నగరంలో విమానాశ్రయం విషయంలో గతంలో అడుగులు ముందుకు పడలేదని, ఇప్పుడది నెరవేరిందని అన్నారు. విమానాశ్రయం ఏర్పాటుకు 2800 మీటర్ల రన్వే అవసరం. 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని కేంద్రం నుంచి ప్రతిపాదనలు పంపాం. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే విమానాశ్రయం పనులు వేగవంతం అవుతాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎన్వోసీ తీసుకొని క్లియరెన్స్ ఇచ్చాం. భద్రాద్రి విమానాశ్రయం విషయంలో గతంలో ఒక స్థలాన్ని ప్రతిపాదించారు. గతంలో సూచించిన స్థలం అనువుగా లేదని , మరో స్థలం ప్రతిపాదించారు. భద్రాద్రి విషయంలో కొత్త స్థలంపై ఫీజిబులిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం” అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

విమానాశ్రయం ఏర్పాటు వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. వరంగల్ లో టెక్టైల్స్ కి, విద్యా రంగం కి అపారమైన అవకాశాలు ఉన్నాయి. విమానశ్రేయ ఏర్పాటుతో ఆ ప్రాంత అభివృద్ధి వేగవంతం అవ్వనుందని మంత్రి అన్నారు.

వరంగల్ విమానాశ్రయాన్ని ఉడాన్ స్కీమ్ తో అనుసంధానం చేస్తూ.. కమర్షియల్ ఆపరేషన్స్ కు సంబంధించి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  జి కిషన్ రెడ్డి అన్నారు.

కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి మాట్లాడుతూ, చరిత్రాత్మకమైన ఓరుగల్లు పట్టణానికి విమాన సేవలను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే.. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వరంగల్ శివారులోని మామునూరు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని అన్నారు. విమానాశ్రయం ఏర్పాటు వల్ల వరంగల్ లో ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు తెలంగాణ ప్రజలకు ఉన్న చిరకాల కోరిక అని ఆయన అన్నారు.

 

స్వాతంత్ర్యానికి ముందు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా వరంగల్ (మామునూరు) ఎయిర్ పోర్టుకు గుర్తింపు ఉంది. అంతటి పురాతనమైన ఈ విమానాశ్రయానికి పునర్వైభవం కల్పించడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. వరంగల్లుకు కాకతీయుల నాటి వైభవాన్ని కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. ఇందుకు గాను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారికి, విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

తెలంగాణలోని వరంగల్, భద్రాచలం, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో విమాన సదుపాయాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కృషిచేస్తోంది.  పర్యాటకం, వాణిజ్యం కోసం వరంగల్‌తో అనుసంధానత కోసం వివిధ ఎయిర్‌లైన్స్ తోనూ చర్చలు ప్రారంభిస్తాం. ఈ మామునూరు విమానాశ్రయం పునర్వినియోగంలోకి తీసుకురావడం ద్వారా.. వరంగల్  చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *