ప్రీ లాంచ్‌ మోసాలు

ప్రీ లాంచ్‌ మోసాలు.. ప్రీ లాంచ్‌ ఆఫర్‌లో తక్కువ ధరకు ప్లాట్‌ వస్తుందనే ఆశతో సామాన్య ప్రజలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను నమ్మి నిండా మునుగుతున్నారు. ఇల్లు, ఓపెన్‌ ప్లాట్‌, ఫ్లాట్‌ అనేది హైదరాబాద్‌లో ఎక్కడో ఓ దగ్గర ఉండాల్సిందే.. ఇప్పుడు ఆలస్యం చేస్తే మున్ముందు కొనే పరిస్థితి ఉంటుందో ఉండదోననే ఆందోళనతో చాలామంది ప్రీ లాంచ్‌ ఆఫర్‌కు ఆకర్షితులవుతున్నారు. మూడు, నాలుగేండ్ల క్రితం ప్రీ లాంచ్‌ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు

సామాన్యుల కష్టార్జితాన్ని నొక్కేస్తున్న కొందరు వ్యాపారులు
అరెస్ట్‌లతోనే సరిపెడుతున్న పోలీసులు
మాకు న్యాయం జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న బాధితులు

ప్రీ లాంచ్‌ ఆఫర్‌లో తక్కువ ధరకు ప్లాట్‌ వస్తుందనే ఆశతో సామాన్య ప్రజలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను నమ్మి నిండా మునుగుతున్నారు. ఇల్లు, ఓపెన్‌ ప్లాట్‌, ఫ్లాట్‌ అనేది హైదరాబాద్‌లో ఎక్కడో ఓ దగ్గర ఉండాల్సిందే.. ఇప్పుడు ఆలస్యం చేస్తే మున్ముందు కొనే పరిస్థితి ఉంటుందో ఉండదోననే ఆందోళనతో చాలామంది ప్రీ లాంచ్‌ ఆఫర్‌కు ఆకర్షితులవుతున్నారు. మూడు, నాలుగేండ్ల క్రితం ప్రీ లాంచ్‌ ఆఫర్లలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ట్రై పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో పది నెలల్లోనే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

ప్రధానంగా వందల కోట్ల మోసం జరిగిన కేసులు పది వరకు ఉన్నాయి. సాహితీ ఇన్‌ఫ్రా, సాయి నిఖిత, భువనతేజ, ఈవీకే ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బైబ్యాక్‌ పాలసీ పేరుతో సువర్ణభూమి, ఆర్‌-హోమ్స్‌(ఆర్‌జే హోమ్స్‌), సాయి సూర్య డెవలపర్స్‌, అర్బన్‌వుడ్‌ రియాల్టీ ఎల్‌ఎల్‌పీ, జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా తదితర సంస్థలు మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

ఆయా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…

సాహితీ ఇన్‌ఫ్రా పై హైదరాబాద్‌ సీసీఎస్‌తో పాటు సైబరాబాద్‌, రాచకొండ, విజయవాడ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసును ఈడీ విచారిస్తుంది. సుమారు 2500 మంది బాధితుల వద్ద వెంచర్ల పేరుతో రూ. 3 వేల కోట్ల వరకు సంస్థ నిర్వాహకుదు బూదాటి లక్ష్మీనారాయణ వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు నిర్వహిస్తూ అటూ బాధితులు, ఇటూ సంస్థ యజమాన్యం వద్ద భారీగా వసూలు చేసేందుకు ప్లాన్‌ చేశాడు. ఇంతలోనే ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. బాధితులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
శంకర్‌పల్లి మోకిలలో తక్కువ ధరకు విల్లా అంటూ ప్రీ లాంచ్‌ పేరుతో నారాయణగూడకు చెందిన కె.రాఘవేంద్రతో పాటు మరికొందరిని ఈవీకే ప్రాజెక్ట్స్‌ నిర్వాహకులు శ్రీనివాస్‌రావు, పద్మజ, వంశీకృష్ణ చౌదరి, అనూష, సమంత మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌లో నమోదైన ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది.
బైబ్యాక్‌ పాలసీ పేరుతో సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ నిర్వాహకుడు బొల్లినేని శ్రీధర్‌, బొల్లినేని దీప్తి భారీ ఎత్తున అమాయకులతో ప్రీ లాంచ్‌ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. రూ. 35 లక్షలు పెట్టుబడి పెడితే రెండేండ్లలో రూ. 55 లక్షలు తిరిగి ఇవ్వడం.. లేదంటే ప్లాట్‌ను ఇస్తామంటూ నమ్మించి మోసం చేశారు. దీంతో ఇటీవల బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
సెలబ్రిటీల ఫొటోలతో భారీగా ప్రకటనలు ఇచ్చిన ఆర్‌ హోమ్స్‌@ ఆర్జే హోమ్స్‌ నిర్వాహకులు భాస్కర్‌ గుప్త, ఆయన భార్య సుధారాణి నగరం నలు మూలలా వివిధ పేర్లతో వెంచర్లను ప్రారంభించారు. 2020 నవంబర్‌లో ఘట్‌కేసర్‌ ప్రాంతంలో జై వాసవీ బ్లిస్‌ హైట్స్‌ పేరుతో వెంచర్‌ను ప్రారంభించారు. ఇక్కడ సుమారు 600 మంది బాధితులు రూ. 150 కోట్ల వరకు చెల్లించారు. ఆ తరువాత ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా బాధితులను ఇబ్బందులు పెడుతుండటంతో సైబరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు.
ప్రముఖ సినీ హీరోను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చూపిస్తూ గచ్చిబౌలిలోని సాయి సూర్య డెవలపర్స్‌ నిర్వాహకులు సతీశ్‌చంద్రగుప్త ఎన్‌ఆర్‌ఐకీ రూ. 3.63 కోట్ల మోసం చేశాడు. ఇతనితో పాటు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
అర్బన్‌వుడ్‌ రియాల్టీ ఎల్‌ఎల్‌పీ సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్‌ మేక, గగన్‌దీప్‌ సింగ్‌ కోహ్లి పై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాజాగూడలో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నామని 18 నెలల్లో ప్రాజెక్ట్‌ పూర్తవుతుందంటూ పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. సుమారు రూ.100 కోట్ల వరకు మోసం చేశారని బాధితులు పేర్కొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *